Andhra Pradesh: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రోజుకో ట్విస్ట్:వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై రోజుకో ట్విస్ట్ వెలువడుతూనే ఉంది. ఇటీవలే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై తమ స్టాండ్ ఏమీ మారలేదు అంటూ కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపై అక్కడి కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే లేటెస్ట్ గా విశాఖ ఉక్కు పరిశ్రమను బలోపేతం చేసే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర బృందం భేటీ అయింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రోజుకో ట్విస్ట్
విశాఖపట్టణం, ఏప్రిల్ 2
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై రోజుకో ట్విస్ట్ వెలువడుతూనే ఉంది. ఇటీవలే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై తమ స్టాండ్ ఏమీ మారలేదు అంటూ కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపై అక్కడి కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే లేటెస్ట్ గా విశాఖ ఉక్కు పరిశ్రమను బలోపేతం చేసే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర బృందం భేటీ అయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ముఖ్యమంత్రి నివాసంలో చర్చలు జరిపింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి ప్యాకేజీని మంజూరు చేసిన తర్వాత తదనంతర పరిణామాలపైనా, తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ… రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీఎఫ్)తో ప్లాంట్కు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినందుకు ఆయన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు స్టీల్ ప్లాంట్ పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడం, ప్రస్తుతం పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేసులతో పాటు, 3వ ఫర్నేస్ను కూడా తిరిగి ప్రారంభించడం వంటి అంశాలను ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో తమ రాష్ట్రానికి భావోద్వేగ అనుబంధం ఉందని, దీనిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. స్టీల్ ప్లాంట్ బలోపేతం చేసేందుకు తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, ఆర్ధిక సాయం ప్రకటించినందుకు ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్రానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమన్వయంతో కలిసి పనిచేయాలని, ఉక్కు కర్మాగారానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పారు. ఇందుకు అవసరమైన సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణ వ్యయం తగ్గించుకోవడంతో సమర్ధత, సామర్ధ్యం పెంచుకోకపోతే ఆశించిన ఫలితాలు రావని అధికారులతో ముఖ్యమంత్రి అన్నారని ఆయన కార్యాలయం తెలిపింది. ఈ సమావేశంలో ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర, ఎన్ఎండీ సీఎండీ అమితవ ముఖర్జీ, ఆర్ఐఎన్ఎల్ ఇన్చార్జ్ సీఎండీ అజిత్ కుమార్ సక్సేనా, మెకాన్ సీఎండీ ఎస్కే వర్మ, ఎంఎస్టీసీ లిమిటెడ్ సీఎండీ మనోబేంద్ర ఘోషల్ పాల్గొన్నారు.
కావలసింది కాప్టివ్ మైన్ : కార్మిక సంఘాలు:
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను బలోపేతం చేయడం పై ప్రభుత్వాలు ముందుకు రావడం సంతోషమే అయినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బతకాలంటే దానికంటూ ప్రత్యేకమైన గనుల కేటాయింపు జరగాల్సిందేనని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ కార్మిక సంఘాలు అంటున్నాయి. ప్యాకేజీలతో తాత్కాలికంగా అప్పులు తీరినా శాశ్వతం గా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రావాలంటే ముడి ఖనిజ కేటాయింపు మాత్రమే మార్గమని వారు చెబుతున్నారు. ప్రభుత్వాలు కూడా అదే మాట చెబుతున్నాయి. ప్రభుత్వ కార్యాచరణ కూడా ఆ దిశగానే ఉండాలని ఆంధ్ర ప్రజల కోరిక.